అనగనగా దశాబ్దమున్నర క్రితం, తెలుగు వాళ్ళు ఎవరైనా కొత్తగా పరిచయమై లేదా ఆల్రెడీ పరిచయం ఉన్నవాళ్లో తెలుగు రాయటం చదవటం రాదు అన్నప్పుడు అరెరే ఏమిటీ దౌర్భాగ్యం పితృభాష చదవలేని వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో కదా అని బాధేసేది. క్రమేపి అది నార్మల్ అయిపోయింది, వాళ్ళు మిస్ అవుతున్న దాని గురించి నాకెందుకు వర్రీస్ అనుకుని వదిలేసా. తెలుగు అంతరించి పోతోంది, మన భాషని కాపాడుకోవాలి అని మేధావులు నాన్ మేధావుల ఉద్యమం మొదలైంది కొన్నేళ్ల క్రితం, పిల్లలకి తెలుగు నేర్పించాల్సిందే అని వీళ్లంతా కంకణం కట్టుకున్నారు, ఇది సాధ్యమేనా? అక్కడక్కడ మిగిలి ఉన్న కొన్ని తెలుగు మీడియం స్కూల్స్ లో చదివే పిల్లలతో తెలుగు బతికేస్తుందా? కష్టమే, ఈ తెలుగు మీడియం పిల్లలు కూడా ఉన్నత చదువుల్లో ఇంగ్లీష్ కి మారిపోవాల్సిందేగా. పైగా అలా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ కి షిఫ్ట్ అయి చాలా ఇబ్బంది పడతారు, వెనకబడతారు, ఆ భయంతో పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పిస్తున్నారు.
నేను 4th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం ఆ తర్వాత తెలుగు మీడియం 10th క్లాస్ వరకు, next పాలిటెక్నిక్ అంతా ఇంగ్లీషే. 10th వరకు 75% స్టూడెంట్ అయిన నేను, polytechnic లో అంతా ఇంగ్లీష్ ఉండేసరికి దాన్ని అందుకోలేకపోయాను, అంత effort కూడా పెట్టలేదు, జస్ట్ మూడున్నర ఏళ్ళు timepass చేసాను. పూర్తిగా తెలుగు మీడియం చదివిన వాళ్ళు engineering medicine లాంటి వాటిల్లో ఎంత కష్టపడతారో, దాని బదులు అంతా ఇంగ్లీష్ మీడియం ఉంటే బెటర్ కదా అనిపించేది. అప్పుడు తెలుగు ఏమైపోవాలి? కేవలం మాటల్లోనే మిగిలిపోవాలి, అలానే జరుగుతుందేమో. అంటే తెలుగు రాసి చదవగలిగే వాళ్ళు టపా కొట్టేకొద్దీ ఇంక పితృభాషలో రాతలు ఉండవు.
నాకూ ఒక ఫ్రెండ్ కి ఒకసారి దీని గురించి డిస్కషన్ జరిగింది, వాడు అనేది ఏంటంటే ఎందుకు రాయాలి ఎందుకు చదవాలి తెలుగు? టింగ్లీష్ లో రాస్తున్నారు, అవసరమైతే గూగుల్ లో వెతుక్కోవచ్చు, తెలుగు సాహిత్యం online audio books లో దొరుకుతోంది, ఇంక తెలుగు నేర్చుకోవాల్సిన అవసరమేముంది ? మాట్లాడటమే ఎక్కువ అన్నాడు, కరెక్టే కద అనిపించింది. కానీ తెలుగులో రాసి చదవగలిగితే ఎంత బాగుంటుందో కదా అని నేనంటే, ఏం లేదు ఇంగ్లీష్ లో రాసినా చదివినా చాలా బాగుంటుంది అని వాడి కౌంటర్.
నిన్న రాత్రి జంధ్యాల “హైహై నాయక” చూస్తుంటే 1989 లోనే తెలుగు మాష్టార్లకి విలువ లేదు పిల్లని ఇచ్చేవాళ్ళు కాదు అనేది ఎంత satirical చూపించాడో ఆయన. ఆ లెక్కన మన తెలుగు ఎప్పటికప్పుడు తరిగిపోతోందే గాని పెరగటం లేదు. సైన్సు లెక్కల ట్యూషన్లకి వెళ్తారు గానీ తెలుగు కోసం ట్యూషన్ కి ఎవరైనా వెళ్తారా ?
పితృభాష ఎప్పటికప్పుడు ignorance కి గురి అవుతూనే ఉంది, ఇది జీవపరిణామ అభివృధ్ది క్రమంలో జరిగే సహజమైన విషయమే కదా, మరి తెలుగు ఏమైపోతుందో అనే రోదన వేదన ఎందుకు? తెలుగు మీడియంలో చదివినవాడు వెనకపడుతూనే ఉంటాడు, i support english medium.
తెలుగు రాసే చదివే భవిష్యత్ తరాలు కనుమరుగవటానికి దశాబ్దం కూడా పట్టదేమో.
పితృదినోత్సవ శుభాకాంక్షలతో ముగిస్తా, ఇంకా నాలాగ తెలుగులో రాసేవాళ్ళని encourage చేయండి, కింద link నొక్కి తోచినంత చేతనైనంత దక్షిణ సమర్పించుకోండి, తెలుగు రాతగాళ్ళని బతికించుకోండి.